
ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ దారి దోపిడీకి పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను పటాన్ చెరు పోలీసులు అరెస్ట్ చేశారు.. పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి, క్రైమ్ ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల మేరకు కిష్టారెడ్డిపేట, ఇంద్రేశం,రామేశ్వరం బండ శివారులో నివాసం ఉంటున్న ఏడుగురు సభ్యుల ముఠా పారిశ్రామిక వాడలో ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తూదారి దోపిడీలకు పాల్పడుతున్నారు. సోమవారం మండలంలోని ఇంద్రేశం వద్ద ఓ అర్ అర్ సర్వీస్ రోడ్ లో వాహనాలను తనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న ఏర్పుల నర్సింలు,హరిజన నర్సింలు, నాందారి హన్మంతు, వడ్డే అంజమ్మ, విశ్లవత్ ఇందిర, లక్ష్మి, నిర్మలను పట్టుకున్నామని చెప్పారు. ఒంటరి మహిళలే టార్గెట్ గా దోపిడీ చేస్తున్నట్లు గుర్తించామని. వీరి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు, రెండు తులాల బంగారం, రూ. 10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.