
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని, జిల్లా గ్రంథాలయ శాఖకు పన్నుల రూపంలో30 కోట్ల నిధులు సమకూరాయనని గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం 18 లైబ్రరీలు పాఠకులకు సేవలు అందిస్తుండగా మరో 14 లైబ్రరీ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు కొరత లేదని తెలిపారు. గ్రంథాలయ శాఖ డైరెక్టర్ వద్ద ఈ ఫైల్ పెండింగ్ లో ఉందని త్వరలోనే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే లైబ్రరీ భవనాల నిర్మాణం పనులు చేపడతామన్నారు. అలియాబాద్ లైబ్రరీ లో వసతులు లేమి కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని 65 లక్షల వ్యయంతో నూతన బిల్డింగ్ నిర్మాణం పనులు సరవేగంగా సాగుతున్నాయి అన్నారు. కీసరలో 1.5 కోట్లు వ్యయంతో అధునాతన భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడ పోటీ పరీక్షలు అవసరమైన అన్ని రకాల స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటుందని, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఉద్యోగాల కోసం పోటీపడే నిరుపేద అభ్యర్థులకు తోడ్పాటు అందించేందుకు వీలుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియం చేసుకునేందుకు ముందుకు రావాలన్నారు. మల్కాజిగిరిలో జిహెచ్ఎంసి నిధులతో లైబ్రరీ భవనం నిర్మించామని ప్రస్తుతం ఆ భవనం సీఎంసి అవసరాల కోసం వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై జోనల్ కమిషనర్ సంచిత్ కుమార్ తో సంప్రదింపులు జరుపుతున్నామని త్వరలోనే ఆ భవనం గ్రంథాల అవసరాలకు వినియోగించుకునేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ అద్దె భవనంలో లైబ్రరీ కొనసాగుతుంది.ఇక్కడ కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవమేనన్నారు. గ్రంథాలయ శాఖలో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందని ఆ ప్రభావం లైబ్రరీల నిర్వహణపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠకులలో పఠనా శక్తి పెంపొందించేందుకు లైబ్రరీలు దోహదపడతాయన్నారు. డిజిటల్ చదువులతో కంటి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున పుస్తకాలు చదవడం వైపే యువత దృష్టి పెట్టాలని సూచించారు